న్యూఢిల్లీ : ప్రతి యువతి జీవితంలో వివాహ వేడుక ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కుటుంబ సబ్యులు, స్నేహితులు ఆ సమయంలో తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది. ప్రియాంక భాటియా తొమ్మిదేండ్ల వయసులో క్యాన్సర్ కారణంగా తన తండ్రిని కోల్పోయింది. పెండ్లి రోజున తండ్రి ఫోటోతో ప్రియాంక తాన తాతతో కలిసి మంటపం పైకి నడిచివచ్చింది.
ప్రియాంక పెండ్లి రోజు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి మరణానంతరం తాత అన్నీ తానై తనను చూసుకున్నారని చెబుతూ ప్రియాంక ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. ఆమె స్టోరీని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తమ సోషల్ మీడియా వేదికలపై షేర్ చేసింది. తాను 9 ఏండ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, ఆ కొన్నేండ్లలోనే తండ్రి తనను ఎంతో ప్రేమగా చూసుకున్నాడని, తనకు మామిడి పండ్లు ఇష్టం కావడంతో ప్రతి వేసవిలో క్రమం తప్పకుండా పెద్ద బాక్స్లో వాటిని ఇంటికి తీసుకువచ్చేవాడని ప్రియాంక గుర్తుచేసుకుంది.
తండ్రిని తాను ఇప్పుడు ఎంతో మిస్ అవుతున్నానని తాము ఒంటరివారమయ్యామని పేర్కొంది. తండ్రి లేని లోటును తీరుస్తూ తాత తనను పెంచాడని, తాను బాగా చదువుకునేలా ప్రోత్సహించి తనకు కావాల్సినవన్నీ సమకూర్చాడని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. పైనుంచి మీ నాన్న ఆశీస్సులు మీకుంటాయని డిప్రెషన్కు లోనుకావద్దని పలువురు యూజర్లు రాసుకొచ్చారు.