చెన్నై : మితిమీరిన హోంవర్క్ చేయలేక ఒత్తిడిని అధిగమించేందుకు తొమ్మిదో తరగతి విద్యార్ధి అర్ధంతరంగా తనువు చాలించిన ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లా పేరాలంలో జరిగింది. హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్న స్కూల్ నుంచి వేరే స్కూల్కు తనను మార్చించాలని బాలుడి వినతిని తల్లితండ్రులు తోసిపుచ్చడంతో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సోమవారం ఉదయం ఒంటికి నిప్పంటించుకున్న బాలుడు ఆపై విగతజీవిగా మారాడు. బాలుడిని 9వ తరగతి విద్యార్ధి సంజయ్గా గుర్తించారు. సంజయ్ పేరాలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. స్కూల్లో హోంవర్క్ అధికంగా ఇస్తుండటంతో తనను వేరే స్కూల్లో చేర్పించాలని కోరగా తల్లితండ్రులు నిరాకరించారు.
తీవ్ర మనస్ధాపానికి లోనైన సంజయ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాలుడిని కాపాడిన కుటుంబసభ్యులు తిరువారూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు సంజయ్ మరణించాడు. పేరాలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.