లక్నో : యూపీలోని అలీఘఢ్ కాలేజ్లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో విద్యార్ధులు పాకిస్తాన్కు మద్దతుగా నినాదాలు చేస్తున్న వీడియోలు వెలుగుచూశాయి. పాక్ అనుకూల నినాదాలు చేసిన వారిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 13న చేపట్టిన తిరంగా ర్యాలీలో కొందరు విద్యార్ధులు పాక్ అనుకూల నినాదాలు చేశారు. ఈ ఘటనపై ర్యాలీ వీడియోలతో కాలేజ్ యాజమాన్యానికి కొందరు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై కాలేజ్ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో పాటు ఈ వ్యవహారం బయటకు రాకుండా తొక్కిపెట్టిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆపై ఫిర్యాదుదారు సంబంధింత వీడియోలతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు బాధ్యులుగా ప్రిన్సిపల్ కాలేజ్ మేనేజర్నూ నిందితులుగా చేర్చారు. ఇక ర్యాలీలో ముందు వరుసలో లెక్చరర్లు ఉన్నారని, పెద్దసంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్న ర్యాలీలో అనూహ్యంగా పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపించాయని, ఈ నినాదాలు ఎవరు చేశారో తెలియదని ర్యాలీలో పాల్గొన్న రజన్ కుమార్ అనే విద్యార్ధి మీడియాకు వెల్లడించారు.
ఇక ఈ ర్యాలీలో కొందరు హిందుస్ధాన్ జిందాబాద్ అని నినదించగా దానికి కౌంటర్గా మరికొందరు పాక్ జిందాబాద్ అనే నినాదాలు చేసినట్టు సమాచారం ఉందని దీనిపై దర్యాప్తు చేపడుతున్నామని అలీఘఢ్ ఎస్పీ పలష్ బన్సల్ పేర్కొన్నారు. ఈ ఘటనలో విచారణ అనంతరం నిందితులపై చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.