చెన్నై : టెక్నాలజీ వేగంగా జనజీవితాల్లోకి దూసుకొస్తున్నా మూఢనమ్మకాలు ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. చేతబడి జరిగిందనే అనుమానంతో పూజారి మహిళలను కొరడా దెబ్బలతో హింసించిన ఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లా నరైకినర్ గ్రామంలో వెలుగుచూసింది.
దుష్టశక్తులను తరిమేస్తానని పలువురు మహిళలను పూజారి వేషధారణలో ఉన్న వ్యక్తి కొరడా దెబ్బలు కొడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూజారి మహిళలను కొడుతుండగా అక్కడ చేరిన జనం చప్పట్లు, ఈలలు వేస్తూ ఈ తంతును చూస్తుండటం కనిపించింది. బాధిత మహిళలను ఏమాత్రం కనికరం లేకుండా కొరడాతో కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
గ్రామంలో ఆలయ ఉత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల 18 గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. 20 ఏండ్ల తర్వాత ఈ వేడుకలు జరుగుతుండటంతో పెద్ద ఎత్తున జనం గుమికూడారు. పూజారి కొరడాతో మహిళలను కొడుతుండటం బాధాకరమే అయినా వీరికి భవిష్యత్లో మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ ఘటన నమక్కల్ జిల్లా వరరాజపెరుమాళ్ చెల్లిఅమ్మన్ మరియమ్మన్ ఆలయంలో వెలుగుచూసింది. ఏప్రిల్ 29న ప్రారంభమైన ఆలయ ఉత్సవాలు మే 30న ముగుస్తాయి.