న్యూఢిల్లీ : విమాన ప్రయాణీకుల హ్యాండ్బ్యాగ్స్పై పరిమితి విధించారు. ఒక ప్యాసింజర్కు ఒక హ్యాండ్బ్యాగ్నే అనుమతించనున్నట్టు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సొసైటీ (బీసీఏఎస్) ప్రకటించింది. విమానాశ్రయాల్లో రద్దీ, భద్రతాపరమైన ముప్పు దృష్ట్యా బీసీఏఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశీ విమానాలన్నింటికీ ఈ నిబంధన వర్తించనుంది.
లేడీ బ్యాగ్తో సహా సర్క్యులర్లో ఇప్పటికే పొందుపరిన వస్తువులు కాకుండా ఒకటి కంటే ఎక్కువ హ్యాండ్బ్యాగ్లను తీసుకెళ్లడానికి ప్రయాణీకులను అనుమతించరని బీసీఏఎస్ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. స్క్రీనింగ్ పాయింట్స్ వద్దకు ప్రయాణీకులు సగటున రెండు నుంచి మూడు హ్యాండ్బ్యాగ్లతో వస్తుండటంతో క్లియరెన్స్ టైం పెరగడంతో పాటు అవాంఛనీయ జాప్యం చోటుచేసుకుంటోంది.
ఇతర ప్రయాణీకులకు అసౌకర్యం కలుగుతోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రయాణీకులను సెక్యూరిటీ చెక్స్కు అనుమతించే ముందు ఎయిర్లైన్స్ తమ ప్రయాణీకుల హ్యాండ్బ్యాగ్స్పై వారికి సూచనలు చేయాలని, అన్ని విమానయాన సంస్ధలు ఒన్ హ్యాండ్బ్యాగ్ రూల్ గురించి తమ ప్రయాణీకులకు అవగాహన కల్పించాలని బీసీఏఎస్ పేర్కొంది. ఎయిర్లైన్ సంస్ధలు తమ టికెట్లు, బోర్డింగ్ పాసులపై ఈ నిబంధన గురించి ప్రచారం చేయాలని సూచించింది. చెక్ ఇన్ కౌంటర్ల వద్ద వన్ హ్యాండ్బ్యాగ్ రూల్పై బ్యానర్లు, బోర్డులు, స్టాండీలు ఏర్పాటు చేయాలని ఈ ఉత్తర్వుల్లో కోరింది.