బెంగళూర్ : కర్నాటకలో మళ్లీ హిజాబ్ అంశం ముందుకొచ్చింది. కొందరు విద్యార్ధినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతున్నారని మంగళూర్ యూనివర్సిటీ కాలేజ్ విద్యార్ధులు నిరసనలకు దిగారు. ఈ ఆందోళన నేపధ్యంలో హిజాబ్ అంశాన్ని మళ్లీ లేవనెత్తాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు వెలువరించిందని, ప్రతిఒక్కరూ దాన్ని పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు. 99.99 శాతం ఈ ఉత్తర్వులు అమలవుతున్నాయని అన్నారు. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా పాటించాల్సిందేనని చెప్పారు.
ఇక మంగళూర్ వర్సిటీ కాలేజ్లో 44 మంది విద్యార్ధినులు హిజాబ్ ధరించి కాలేజ్కు రావడమే కాకుండా తరగతులకూ హాజరువుతున్నారని కొందరు విద్యార్ధులు క్యాంపస్లో ఆందోళన చేపట్టారు. క్యాంపస్లో హిజాబ్ ధరించరాదని మే 16న కాలేజ్ నిర్వాహకులు నిషేధం విధించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యాసంస్ధల్లో హిజాబ్పై కర్నాటక హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో కాలేజ్ నిర్వాహకులు విఫలమయ్యారని విద్యార్ధులు నిరసన వ్యక్తం చేశారు.
తమను హిజాబ్ ధరించి క్లాస్లకు హాజరయ్యేందుకు అనుమతించడం లేదని ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ మహిళల కళాశాల విద్యార్ధినులు ఈ ఏడాది జనవరిలో కోర్టును ఆశ్రయించారు. మార్చి 16న ముస్లిం విద్యార్ధినుల పిటిషన్ను కర్నాటక హైకోర్టు తోసిపుచ్చింది. ఇస్లాం మత ఆచారాల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. యూనిఫాంలు ధరించాల్సిన ప్రభుత్వ కళాశాలల్లో హిజాబ్లపై నియంత్రణలు విధించవచ్చని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు సమర్ధించింది.