లక్నో : యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో యూపీలో మరోసారి పాలనా పగ్గాలు చేపట్టేందుకు కమలనాధులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2014 నుంచి తొలిసారి బీజేపీ కూటమి తాజా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ముస్లిం అభ్యర్ధిని బరిలో నిలిపింది. సౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముస్లిం అభ్యర్ధి హైదర్ అలీ ఖాన్ను బీజేపీ కూటమి ఎన్నికల రంగంలో దించింది.
సీనియర్ కాంగ్రెస్ నేత నూర్ బానో మనవడు హైదర్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించింది. 2014 నుంచి బీజేపీ కూటమి నుంచి ఓ ముస్లిం అభ్యర్ధిని ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కావడంతో హైదర్ అలీ ఖాన్ ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. హైదర్ (36)కు తొలుత కాంగ్రెస్ టికెట్ దక్కగా ఆ పార్టీని వీడి బీజేపీ మిత్రపక్షం, అనుప్రియా పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్లో చేరారు.
అప్నాదళ్ నుంచి హైదర్ అలీ ఖాన్ సౌర్ నియోజకవర్గంలో ఎస్పీ నేత ఆజం ఖాన్ కుమారుడు అబ్ధుల్లా ఆజంతో తలపడనున్నారు. రాంపూర్ రాజ కుటుంబానికి చెందిన హైదర్ బ్రిటన్లోని ఎసెక్స్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. హైదర్ తండ్రి నవాబ్ ఖాజిం అలీ ఖాన్ సౌర్, బిలాస్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు.