న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నేత సునీల్ జాఖడ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన నేపధ్యంలో మరో ఐదుగురు ప్రముఖ నేతలు కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. పంజాబ్ మాజీ మంత్రులు గురుప్రీత్ సింగ్ కంగర్, బల్బీర్ సింగ్ సంధూ, రాజ్ కుమార్ వెర్కా, సుందర్ శ్యామ్ అరోరా, మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ ధిల్లాన్ శనివారం కాషాయ పార్టీ గూటికి చేరారు.
గత నెలలో పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరిన తర్వాత పెద్దసంఖ్యలో నేతలు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరుతున్నారు. ఇక పంజాబ్ కాంగ్రెస్లో వలసల పర్వానికి తెరపడకపోవడం పార్టీ అగ్ర నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది.