న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరమున్నదని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్(ఎన్సీఎస్సీ) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదించింది. సందేశ్ఖాలీలో టీఎంసీ మద్దతుదారులు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఎన్సీఎస్సీ నివేదికను రూపొందించి రాష్ట్రపతికి సమర్పించిందని కమిషన్ చీఫ్ అరుణ్ హల్దార్ శుక్రవారం తెలిపారు. టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్, అతని మద్దతుదారులు బలవంతంగా స్థానికుల భూములు లాక్కోవటమేగాక తమను లైంగికంగా వేధించారని పెద్ద సంఖ్యలో మహిళలు ఫిర్యాదు చేయటంతో ఎన్సీఎస్సీ ప్రతినిధి బృందం గురువారం సందేశ్ఖాలీని సందర్శించింది. రాష్ట్రపతికి నివేదికను సమర్పించిన తర్వాత కమిషన్ చీఫ్ అరుణ్ విలేకరులతో మాట్లాడుతూ సందేశ్ఖాలీలో స్థానికులపై జరిగిన దౌర్జన్యాలు, వారి అనుభవించిన హింసను వివరించారు.
ఎస్సీల హక్కులను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 338 ప్రకారం పశ్చిమ బెంగాల్లో పరిస్థితిపై రాష్ట్రపతి పాలన విధించాలని తాము సిఫారసు చేసినట్టు అరుణ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం షెడ్యూల్డ్ రాజ్యాంగ భద్రతల పనితీరుపై ప్రతి ఏటా, ఇతర సమయాల్లో రాష్ట్రపతికి ఎన్సీఎస్సీ నివేదికలు సమర్పించాల్సిన బాధ్యత ఉన్నది. కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్టు అరుణ్ తెలిపారు. సందేశ్ఖాలీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొంటూ తమను ఆ ప్రాంతాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారని కమిషన్ ఆరోపించింది. అంతేగాక తమ పర్యటనకు ఎలాంటి ఏర్పాట్లు కూడా అక్కడి ప్రభుత్వం చేయలేదన్నారు. రాష్ట్రంలో నేరగాళ్లు ప్రభుత్వంతో చేతులు కలిపారని అరుణ్ ఆరోపించారు.
సందేశ్ఖాలీలో అల్లర్లకు, హింసకు, దౌర్జన్యానికి పాల్పడిన టీఎంసీ నేత షాజహాన్ షేక్పై రేషన్ కుంభకోణానికి సంబంధించి ఈడీ గత నెలలో అతని ఇంటిపై దాడి చేసనప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడని, వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని చాలా మంది మహిళా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా ఎస్సీ జనాభా కలిగిన రాష్ర్టాల్లో బెంగాల్ రెండో స్థానంలో ఉన్నదని, హింసాకాండ వల్ల వారంతా ఇబ్బందులు పడుతున్నారని అరుణ్ చెప్పారు. అక్కడి హింసాకాండపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నోటీసు కూడా పంపిన సంగతిని ఆయన గుర్తు చేశారు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడటం లేదని, టీఎంసీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధి బృందాలు కూడా సందేశ్ఖాలీని సందర్శించాల్సి ఉన్నది, కానీ అక్కడ శుక్రవారం కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నది.
సందేశ్ఖాలీలో మహిళలను లైంగికంగా వేధించిన అంశం ఇప్పుడు సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణను పరిశీలిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. సందేశ్ఖాలీ దౌర్జన్యాలపై గురువారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ అంశంపై సీబీఐ లేదా సిట్తో కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పిల్లో కోరారు. అలాగే విచారణను అత్యవసరంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సందేశ్ఖాలీ బాధితులకు పరిహారంతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అలాగే ఈ కేసు దర్యాప్తు, విచారణను పశ్చిమ బెంగాల్ నుంచి తప్పించాలన్నారు.