పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో విద్యార్థులకు త్వరలో డ్రెస్ కోడ్ అమలులోకి రానున్నది. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫాం డ్రెస్ కోడ్ను రూపొందించే పనిలో విద్యా శాఖ నిమగ్నమై ఉన్నదని చెప్పారు. హిజాబ్ ధరించి స్కూల్ వచ్చిన ఒక విద్యార్థినిని అడ్డుకుని హిజాబ్ తొలగించాలని హెడ్ మాస్టర్ చెప్పడంతో కర్ణాటకలో తీవ్ర వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటన వెలువడటం విశేషం సంతరించుకున్నది.
డ్రెస్ కోడ్ యూనిఫాం అనుమతించే కొన్ని విషయాలపై వివరణాత్మక మార్గదర్శకాలు ఉంటాయని పుదుచ్చేరి విద్యా శాఖ డైరెక్టర్ పీఆర్ రుద్రాగౌడ్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత విద్యార్థుకు డ్రెస్కోడ్ను అమలు చేస్తామని చెప్పారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో హింసాత్మకంగా మారిన హిజాబ్ ఆందోళనపై లెఫ్టినెంట్ గవర్నర్తో పాటు ఆ ప్రాంత ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి పుదుచ్చేరి రాజకీయ పార్టీలు తమ ఆందోళనను తెలియజేశాయి. పుదుచ్చేరిలో అలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని అభ్యర్థించాయి.
స్వతంత్ర ఎమ్మెల్యేలు కొందరు తనను కలిసి కేంద్ర పాలిత ప్రాంత అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలపై చర్చించారని లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు లెఫ్టినెంట్ గవర్నర్ను కలవడం సంచలనంగా మారింది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం ఎన్ రంగస్వామికి మద్దతుగా నిలిచారు. ఈ నలుగురు రంగస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నారనే పుకార్లు వ్యాపించడంతో కలకలం చెలరేగింది.