చెన్నై: భారీ వర్షాలకు తమిళనాడు వణికిపోతున్నది. ఎడతెరపిలేని వానలతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా.. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీచేసింది. రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. సోమవారం దక్షిణ అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, రామేశ్వరంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరపిలేని వానలతో రాజధాని చెన్నైలోని చాలా ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. తూత్తుకూడి, చెంగల్పట్టు, నాగపట్టణంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు వందకు పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
వరదల కారణంగా రాష్ట్రంలో గత 24 గంటల్లో ముగ్గురు మృతిచెందారని ప్రభుత్వం ప్రకటించింది. 273 ఇండ్లు దెబ్బతిన్నాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెలలో 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.