న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి పార్టీ నేతల మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆయన కేరళలో మీడియాతో మాట్లాడారు. పార్టీలోని యువత మద్దతు చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు.
అయితే, పార్టీలోని యువతగానీ, సీనియర్లుగానీ ఎవరు మద్దతిచ్చినా పోగొట్టుకోనని, అందరి మద్దతు అవసరమని థరూర్ వ్యాఖ్యానించారు. దేశాన్ని ముందుకు నడిపించగల పునరుత్తేజిత కాంగ్రెస్ను తయారుచేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ సాహసోపేత ప్రయత్నంలో.. ప్రతి ఒక్కరిని కలుపుకపోవడం అవసరమని ఆయన అన్నారు.
గాంధీల కుటుంబం పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించడంతో ఇతరులు కాంగ్రెస్ అధ్యక్షులయ్యే అవకాశం లభించింది. దాంతో శశిథరూర్, మల్లిఖార్జున్ ఖర్గే ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఈ నెల 17న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. 19న ఫలితాలను వెల్లడించనున్నారు.