భోపాల్: ఒక మంత్రి సోదరుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు. దరఖాస్తులు తిరస్కరించడంపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘పళ్లు రాలగొడతా.. నిన్ను సజీవంగా పాతేస్తా’ అని మహిళా అధికారిణిని బెదిరించాడు. (Minister’s Brother Threatens Woman Officer) ఆమె ఫిర్యాదు చేయడంతో అరెస్టైన అతడు వెంటనే బెయిల్పై విడులయ్యాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 22న మంత్రి నాగార్ సింగ్ చౌహాన్ సోదరుడైన ఇందర్ సింగ్ చౌహాన్, జనపద్ పంచాయతీ కార్యాలయానికి వెళ్లాడు. కన్యా వివాహ యోజన కింద అనర్హుల దరఖాస్తులను తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీఈవో ప్రియా కాగ్ను దూషించాడు. ఆమె దారిని అడ్డుకుని మీదకు వెళ్లాడు. ‘నీ పళ్ళు రాలగొడతా, నిన్ను సజీవంగా పాతిపెడతా’ అని బెదిరించాడు. ఇక్కడ అంతా తన మాటే నడుస్తుందని హెచ్చరించాడు.
కాగా, మహిళా అధికారిణి ప్రియా కాగ్ ఈ సంఘటన పట్ల తీవ్రంగా కలత చెందారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో ఇందర్ సింగ్ చౌహాన్పై బెయిల్ లేని నిబంధనలు, సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఏప్రిల్ 24న ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా అనారోగ్యం, అధిక రక్తపోటు కారణంగా వెంటనే బెయిల్పై బయటకు వచ్చాడు.
మరోవైపు మంత్రి సోదరుడైన ఇందర్ సింగ్ చౌహాన్పై గత 32 ఏళ్లలో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీ వంటి పలు అభియోగాలతో సహా 25కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ ఒక్క కేసులో కూడా దోషిగా నిర్ధారణ కాలేదు. తీవ్రమైన నేరాలలో కూడా నిర్దోషిగా విడుదయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారిణి ప్రియా కాగ్ క్షేత్రస్థాయి పర్యటనలను నిలిపివేసి ఆఫీసు పనికే పరిమితమయ్యారు. తన భద్రతకు ముప్పు ఉన్నదని ఆమె పేర్కొనడటంతో పోలీస్ రక్షణ కల్పించారు.
కాగా, అధికార బీజేపీ నేరస్తులను రక్షిస్తున్నదని, అధికార అహంకారంతో వ్యవస్థలను కాలరాస్తున్నదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఆరోపించారు. అయితే తన సోదరుడి చర్యలతో తనకు సంబంధం లేదని మంత్రి నాగర్ సింగ్ చౌహాన్ తెలిపారు. తన సోదరుడు విడిగా నివసిస్తున్నాడని, చట్టం తన పని తాను చేసుకుంటుందని ఆయన అన్నారు.