జోధ్పూర్, నవంబర్ 21: సౌరశక్తి వినియోగంలో ధూళి సమస్యకు ఐఐటీ జోధ్పూర్ శాస్త్రవేత్తలు పరిష్కారం కనిపెట్టారు. సోలార్ ప్యానెల్స్పై దుమ్ము, మురికి చేరితే సౌరశక్తి సేకరణలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాకాకుండా చూసే ప్రత్యేకమైన కోటింగ్ను వారు అభివృద్ధి చేశారు. వారు తయారు చేసిన పైపూతతో సోలార్ ప్యానెల్స్ ఎప్పుడూ తళతళలాడుతూ ఉంటాయి. దుమ్ము నిలిచిపోయేందుకు కారణమయ్యే వాటిని ఆ పూత ఏమాత్రం దరిజేరనివ్వదు. దీంతో పదేపదే పైకి వెళ్లి ప్యానల్స్ను శ్రమకోర్చి శుభ్రం చేయాల్సిన పని తప్పుతుంది. పైగా ప్యానెల్స్ తయారీదారులు దీనిని ఉత్పత్తి దశలోనే పట్టిస్తే సరిపోతుందని పరిశోధకులు అంటున్నారు. దీనిని పట్టిస్తే 20 నుంచి 25 సంవత్సరాల వరకు ప్యానెల్స్ 80-90 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపారు. ఈ పైపూతపై పేటెంట్కు దరఖాస్తు చేసినట్టు చెప్పారు.