గౌహతి: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరాలని ఉందని ఐఐటీ విద్యార్థి పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్, ఈ మెయిల్ ద్వారా తన కోరికను వ్యక్తం చేసిన అతడు క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ విద్యార్థి కోసం వెతికి చివరకు అదుపులోకి తీసుకున్నారు. (IIT Guwahati student) ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన వ్యక్తి అస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో నాలుగో ఏడాది చదువుతున్నాడు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఎస్ పట్ల విధేయత చూపుతూ శనివారం లింక్డ్ఇన్తో పాటు ఈమెయిల్స్లో పోస్టులు పెట్టాడు. ఆ సంస్థలో చేరాలని ఉందంటూ తన కోరికను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఐఐటీ గౌహతి క్యాంపస్ నుంచి అతడు అదృశ్యమయ్యాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఐఐటీ స్టూడెంట్ కోసం వెతికారు. అదే రోజు అస్సాం కమ్రూప్ జిల్లాలోని హజోలో అతడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ పట్ల విధేయత చూపుతూ అతడు చేసిన సోషల్ మీడియా పోస్టులు, ఈమెయిల్స్పై దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థి హాస్టల్ గదిలో ఐఎస్ఐఎస్ను పోలిన నల్ల జెండా, ఇస్లామిక్ పత్రాలున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించిన ఐఎస్ఐఎస్ చీఫ్ హరీస్ ఫరూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూఖీ, అతడి అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్ను అస్సాంలోని ధుబ్రి జిల్లాలో అరెస్టు చేశారు. ఇది జరిగిన నాలుగు రోజులకే ఐఐటీ విద్యార్థి సోషల్ మీడియా పోస్ట్, క్యాంపస్ నుంచి అతడు అదృశ్యం కావడం కలకలం రేపింది.