Railways : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎన్టీపీసీ పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలపై అభ్యర్థులు గత రెండు రోజులుగా బిహార్లో తీవ్రమైన ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లేలా నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల రైల్వే బోగీలకు నిప్పు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంతో రైల్వే శాఖ ఘాటుగా స్పందించింది. రైల్వే స్టేషన్లలో హింసకు దిగడం, నిప్పు పెట్టడం లాంటి ఘటనల్లో పట్టుబడితే మాత్ర జీవితాంతం రైల్వే శాఖలో ఉద్యోగం ఇచ్చే ఛాన్సే లేదని తీవ్రంగా హెచ్చరించింది. అలాంటి వారికి రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వమని తేల్చి చెప్పింది. రైల్వే ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన అభ్యర్థులు రెండు రోజులుగా రైల్వే ఆస్తులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నారని, రైల్వే స్టేషన్లలో హింసకు దిగుతున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, వారందర్నీ వీడియోలో గుర్తించే పనిలో సిబ్బంది నిమగ్నమైందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వారందర్నీ గుర్తించి, వారి జీవితంలో ఇక రైల్వేలో ఉద్యోగం ఇవ్వమని తేల్చి చెప్పింది.
రైల్వే బోర్డు, ఎన్టీపీసీ పరీక్షల ఫలితాలు బిహార్ను కుదిపేస్తున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ అవకతవకలను నిరసిస్తూ అభ్యర్థులు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వెంటనే వాటిని సరిచేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజీపూర్ ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రంగా నడుస్తున్నాయి. పాట్నాలో పోలీసులకు, అభ్యర్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులపై రాళ్లు కూడా రువ్వారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు భాష్పవాయువును కూడా ప్రయోగించారు.