సాగర్: ‘కుక్కను పెంచుకుంటున్నారా.. అయితే పన్ను కట్టండి’ అని హుకుం జారీ చేస్తున్నారు మధ్యప్రదేశ్లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఈ నిర్ణయాన్ని కార్పొరేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. పరిసర ప్రాంతవాసుల భద్రతను, ఆ ప్రాంత శుభ్రతను దృష్టిలో ఉంచుకుని న్యాయ నిపుణులతో చర్చించాక పన్ను విధింపు నిర్ణయం తీసుకొన్నారు. ఈ పన్నును ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ‘కుక్కల వల్ల బహిరంగ ప్రదేశాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీనికి కుక్కల యజమానులను బాధ్యులను చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించాం. పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంశంగా చేయాలని నిర్ణయించాం’ అని కార్పొరేషన్ చైర్మన్ తెలిపారు.