జమ్ము, ఫిబ్రవరి 16: ఓవైపు ఉగ్రమూకలు తమను లక్ష్యంగా చేసుకుని బుల్లెట్లతో ప్రాణాలు తీస్తుంటే మరోపక్క లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం గత 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తమను, కుటుంబ సభ్యులను ఆకలితో చంపుతున్నదని కశ్మీర్ పండిట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని, జమ్ముకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ వారు రాత్రంతా ఇక్కడి బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
డిమాండ్లు నెరవేర్చే వరకు ఇక్కడే 24 గంటలూ నిరసన కొనసాగిస్తామని ఉద్యోగ సంఘ నేత అశ్వినీ పండిత స్పష్టం చేశారు. కశ్మీర్లో పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షణ కల్పిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ రాతపూర్వక హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 22 మైనార్టీ వర్గాలను ఉగ్రమూకలు టార్గెట్ చేశాయని, అందులో భాగంగా కశ్మీరీ పండిట్ ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకున్నారని తెలిపారు.