లక్నో: తాలిబన్ ఉగ్రవాదులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తాలిబన్ల వల్ల పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు తీవ్ర క్షోభను అనుభవిస్తున్నాయని, ఒకవేళ ఆ ఉగ్రమూక ఇండియా దిశగా కదిలివస్తే, అప్పుడు ఆ తీవ్రవాద బృందంపై వైమానిక దాడులు చేస్తామని సీఎం యోగి అన్నారు. లక్నోలో జరిగిన సామాజిక్ ప్రతినిధి సమ్మేళన్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా తయారైందని, ఇండియా వైపు ఏ దేశం కూడా కన్నెత్తి చూడలేదని, తాలిబన్ల వల్లే పాక్, ఆఫ్ఘన్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఒకవేళ ఇండియా వైపు వాళ్లు వస్తే, వైమానిక దాడులు జరుగుతాయన్న విషయం తాలిబన్లకు తెలుసు అని సీఎం యోగి అన్నారు. సమాజ్వాదీ, బహుజన్ సమాజ్, కాంగ్రెస్ పార్టీలు ఎటువంటి అభివృద్ధి చేపట్టలేదని ఆయన ఆరోపించారు. రామభక్తులను చంపిన వాళ్లు దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతారా అని ఆయన పరోక్షంగా సమాజ్వాదీ పార్టీని విమర్శించారు.