లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. యూపీలో బాబు సింగ్ కుష్వాహా, భారత్ ముక్తి మోర్చాతో కలిసి పొత్తు పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ తమ కూటమి అధికారంలోకి వస్తే, అప్పుడు ఇద్దరు సీఎంలు ఉంటారని ఆయన చెప్పారు. ఒకరు ఓబీసీ వర్గానికి చెందినవారు కాగా మరొకరు దళిత వర్గానికి చెందినవారు సీఎం అవుతారని ఓవైసీ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ముగ్గురు డిప్యూటీ సీఎంలు కూడా ఉంటారని, దాంట్లో ముస్లిం వర్గానికి చెందిన వారుంటారని ఆయన అన్నారు.