న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం గురించి కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ (Manish Tewari ) పీటీఐతో ఆదివారం మాట్లాడారు. చరిత్ర ఒకసారి పునరావృతమైతే అది విషాదమని అన్నారు. రెండుసార్లు జరిగితే ప్రహసనమని వ్యాఖ్యానించారు. 2018లో ప్రతిపక్షాల అవిశ్వాసంపై ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న బీజేపీకి ఆయన ఇలా కౌంటర్ ఇచ్చారు.
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మణిపూర్ గురించి ప్రధాని మోదీ కంటి తుడుపుగా ఒక వ్యాఖ్య చేశారని మనీష్ తివారీ విమర్శించారు. ఈ నేపథ్యంలో లోక్సభలో అవిశ్వాస తీర్మానం తీసుకురావడం కంటే ప్రతిపక్షాలకు మరో మార్గం లేదని అన్నారు. లోక్సభలో ఎన్డీయేకు అనుకూలమైన సంఖ్యా బలం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించినట్టు తెలిపారు.
మరోవైపు, మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై పార్లమెంట్లో ప్రకటన చేయాలని ప్రధాని మోదీని బలవంతం చేసేందుకే విశ్వాస తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2018లో ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఎన్డీయే ప్రభుత్వం గెలిచింది. అలాగే తర్వాత ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని చెబుతున్న బీజేపీ నేతలకు విపక్ష నేతలు కౌంటర్ ఇస్తున్నారు.