Mohan Bhagwat : హిందూత్వ అంటే ముస్లింలను భారత్ నుంచి పంపేయడం కాదని, మతపరంగా విబేధాలున్నా మానవత్వం పరంగా ఏకత్వంతో ఉండటం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా న్యూయార్క్లో జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు.
భారత్లో ముస్లింలకు చోటు లేదని హిందువులు అనుకుంటే వారు హిందువులు కాదని ఆయన అన్నారు. ‘‘హిందూ మతం ఏ మతంపైనా వివక్ష చూపదు. దేశంలో హిందువులకు చోటు లేదు అనుకునే హిందువులు.. అసలైన హిందువులు కాదు. మతపరమైన విబేధాలున్నా మానవత్వం పరంగా ఐక్యంగానే ఉంటాం. సంప్రదాయపరంగా చూసినా భారత్.. ప్రతి ఒక్కరికీ ఆశ్రయం ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడా సురక్షితం కాదు అనుకునేవారు ఇండియాను సురక్షితమైన ప్రదేశంగా గుర్తించారు. ప్రపంచంలో మానవత్వం ఒక్కటే అనే జ్ఞానం ఆర్ఎస్ఎస్కు ఉంది. ఎన్ని వైవిధ్యాలు ఉన్నా మనమంతా ఒక్కటే అని చాటి చెప్పడం మా విధి.
హిందూ దేశం కావాలని అడుగుతుంటారు కదా.. ముస్లింలను బయటకు పంపిస్తారా అని కొందరు ముస్లింలు అడుగుతుంటారు. అలాంటివాళ్లకు చెప్పేదొక్కటే అలా అనుకునే హిందువులెవరూ హిందువులు కాదు. నేను, నాది అనుకున్నంత కాలం సమస్యకు పరిష్కారం దొరకదు. మేం, మనం అనుకున్న రోజే పరిష్కారం లభిస్తుంది’’ అంటూ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.