న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నూతన పార్టీని స్థాపించి బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకుంటానని ప్రకటించిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్ ( Harish Rawat ) విమర్శలు గుప్పించారు. బుధవారం ఢిల్లీలో రాహుల్గాంధీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావత్.. అమరీందర్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
అమరీందర్ సింగ్ కొత్తపార్టీని స్థాపించి బీజేపీతో పొత్తు పెట్టకుంటానని ప్రకటించారుగా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన కావాలనుకుంటే కాకులను తినొచ్చు, చేరాలనుకుంటే బీజేపీలో చేరొచ్చు అని హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. లౌకికత్వం విషయంలో ఆయన తన నిబద్ధతను వదులుకోదల్చుకుంటే ఎవరు మాత్రం ఆపగలరు..? అని రావత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సంప్రదాయాలకు కట్టుబడి ఆయన సుదీర్ఘ కాలం పనిచేశాడు. ఇప్పుడు వెళ్లదల్చుకుంటే వెళ్లిపోనీ అన్నారు.