న్యూఢిల్లీ: హాని తలపెడితే, భారత్ ఎవరినీ విడిచిపెట్టదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు చైనాకు గట్టి సందేశాన్ని పంపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ప్రసంగించారు. భారత అమెరికన్లనుద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. 2020 జూన్ 15న లఢక్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైన్యాన్ని ఎదుర్కొన్న భారత సైనికుల ధైర్యాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ‘వారు (భారత సైనికులు) ఏమి చేశారో, మేం (ప్రభుత్వం) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో నేను బహిరంగంగా చెప్పలేను. అయితే హాని కలిగితే భారత్ ఎవరినీ విడిచిపెట్టదని (చైనాకు) సందేశం వెళ్లిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. (భారత్ కో అగర్ కోయి ఛెరేగా తో భారత్ చోరేగా నహీ)’ అని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా నిలిచే దిశగా దూసుకెళ్తున్నదని చెప్పారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా దీనిని నిలువరించలేదన్నారు.
మరోవైపు అమెరికాకు కూడా పరోక్ష సందేశాన్ని రాజ్నాథ్ సింగ్ పంపారు. ‘జీరో-సమ్ గేమ్’ దౌత్యాన్ని భారత్ విశ్వసించదని స్పష్టం చేశారు. అలాగే ఒక దేశంతో సంబంధం వల్ల మరొక దేశానికి నష్టం కలిగించదని తెలిపారు. భారత్ ఎప్పుడూ కూడా ఇలాంటి దౌత్యాన్ని అవలంబించలేదన్నారు. ‘ఇలాంటి దౌత్యాన్ని భారత్ ఎప్పటికీ ఎంచుకోదు. అంతర్జాతీయ సంబంధాల్లో జీరో-సమ్ గేమ్పై మాకు నమ్మకం లేదు’ అని తెలిపారు. విన్-విన్ ఆధారంగా మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని భారత్ కోరుకుంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యాకు భారత్ మద్దతు ఇవ్వడంపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.