న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ.. నరేంద్ర పుతిన్ అవుతారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ఎద్దేవా చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆదివారం రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘2024 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎన్నికలు ఉండవు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీ నరేంద్ర పుతిన్ అవుతారు’ అని విమర్శించారు. బీజేపీ నేతలు మోదీని భారతదేశపు ‘మాలిక్’గా పరిగణించడం ప్రారంభించారంటూ దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో 140 కోట్ల మంది భారతీయులు దేశాన్ని రక్షించాలని నిర్ణయిస్తేనే భారతదేశాన్ని కాపాడుకోగలమని అన్నారు.
కాగా, ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం పెత్తనం తగదంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఎన్నికైన ప్రభుత్వానికే అధికారులపై శాసనాధికారం ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారుల నియామాలకు సంబంధించి ప్రత్యేక ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ప్రతిపక్షాలకు మెజార్టీ ఉన్న రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విపక్ష పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీల అధినేతలు, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలను కలిశారు. తాజాగా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.