న్యూఢిల్లీ: సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, రావత్ రక్షణ సలహాదారుడు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్ మృతదేహాలు మాత్రమే గుర్తించేలా ఉన్నాయని ఆర్మీవర్గాలు తెలిపాయి. హెలికాప్టర్ కూలిన ఘటన తీవ్రత వల్ల అందులో ప్రయాణించిన మిగతా పది మంది సిబ్బంది మృతదేహాలను గుర్తించడం చాలా కష్టంగా ఉన్నదని పేర్కొంది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల సున్నితత్వం, భావోద్వేగ్వాన్ని పరిగణనలోకి తీసుకొని మృతదేహాల సానుకూల గుర్తింపు కోసం సాధ్యమయ్యే అన్ని చర్యలు తీసుకుంటామని ఆ వర్గాలు వెల్లడించాయి.
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సైనిక సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఢిల్లీకి చేరుతున్నారని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మృతదేహాల గుర్తింపులో వారికి అవసరమైన సహాయం, మద్దతు ఇస్తామని చెప్పారు. శాస్త్రీయ చర్యలతో పాటు సానుకూల గుర్తింపు కోసం సన్నిహిత కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటామని పేర్కొన్నారు.
గుర్తింపు ప్రక్రియ పూర్తైన తర్వాతే మరణించిన సైనిక సిబ్బంది మృత దేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఆయా కుటుంబాలతో సంప్రదించిన అనంతరం మరణించిన సిబ్బంది మృతదేహాలకు తగిన సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.