న్యూఢిల్లీ, మే 27: ఇండియా గేట్లోని అమర జవాన్ జ్యోతి వద్ద ఉన్న సైనిక తుపాకీ, హెల్మెట్లను శుక్రవారం జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి తరలించారు. ‘అమర జవాన్ జ్యోతి దగ్గర ఉన్న తుపాకీ, హెల్మెట్ను సాయుధ బలగాలు శుక్రవారం జాతీయ యుద్ధ స్మారకంలో ఉన్న పరమయోధ స్థల్కు తరలించాయి. దీంతో అమర జవాన్ జ్యోతి విలీన ప్రక్రియ పూర్తైంది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
1971 యుద్ధ వీరులకు స్మారకంగా అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. దీనిని 1972 జనవరి 26న అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రారంభించారు. జనవరిలో అమర జవాన్ జ్యోతిలోని జ్వాలను జాతీయ యుద్ధ స్మారకంలో కలిపారు. ఇండియా గేట్కు జాతీయ యుద్ధవీరుల స్మారకం 400 మీటర్ల దూరంలో ఉంది.