న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నది. ఈ ఆకస్మిక మరణాల వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) రెండు అధ్యయనాలు చేస్తున్నది. గుజరాత్లోని గాంధీనగర్లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సదస్సు సందర్భంగా ఐసీఎమ్మార్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ మాట్లాడుతూ.. తాజా అధ్యయనాల గురించి వెల్లడించారు.
కొవిడ్ అనంతరం ఎలాంటి కారణాలు లేకుండానే ఆకస్మిక మరణాలు సంభవించడాన్ని తాము చూస్తున్నామని రాజీవ్ బహ్ల్ చెప్పారు. ఈ అధ్యయనాల ద్వారా కొవిడ్-19 సోకి తగ్గిపోయిన అనంతరం ఏవైనా దుష్పరిణామాలు ఉంటే తెలుసుకోవచ్చని, దాంతో మరిన్ని మరణాలు సంభవించకుండా నిరోధించవచ్చని అన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూల కాయం లాంటి ఏ ఇతర అనారోగ్యాలు కూడా లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు ఉన్నట్టుండి మరణించడాన్ని ఐసీఎమ్మార్ ఆకస్మిక మరణంగా నిర్వచించింది.
శవ పరీక్షల నివేదికల పరిశీలన
ఈ ఆకస్మిక మరణాల అంతు తేల్చడం కోసం న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఐసీఎమ్మార్ ఇప్పటివరకు 50 శవపరీక్షల నివేదికలను పరిశీలించింది. రాబోయే కొద్ది నెలల్లో మరో 50 శవ పరీక్షల నివేదికల పరిశీలన పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. కొవిడ్ కంటే ముందు సంవత్సరాల్లో, కొవిడ్ తర్వాత సంవత్సరాల్లో శవపరీక్షల రిపోర్టుల్లో తేడాలను గుర్తించడం కోసం తాము ఈ శవ పరీక్షల నివేదికలను పరిశీలన చేస్తున్నామని ఐసీఎమ్మార్ చీఫ్ తెలిపారు. కొవిడ్ అనంతరం ఆకస్మిక మరణాలకు దారితీసే ఎలాంటి శారీరక మార్పులు సంభవిస్తున్నాయో ఈ అధ్యయనం ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. ఎక్కువగా గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తులు కుప్పకూలడం వల్లే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
ఎ కేస్ కంట్రోల్ స్టడీ
ఇక ఆకస్మిక మరణాలకు గల కారణాలు తెలుసుకునేందుకు ఐసీఎమ్మార్ చేస్తున్న మరో అధ్యయనం ‘ఎ కేస్ కంట్రోల్ స్టడీ’. ఈ అధ్యయనం కోసం గత ఏడాది కాలంలో మరణించిన 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కుల డేటాను ఐసీఎమ్మార్ వినియోగిస్తున్నది. కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన రోగులను ఒక ఏడాది పాటు పర్యవేక్షించే 40 కేంద్రాల నుంచి ఈ డేటాను సేకరించింది. దేశంలోని ఈ 40 కేంద్రాల్లో కొవిడ్ అడ్మిషన్లు, హాస్పిటల్ డిశ్చార్జ్లు, మరణాల డేటా ఉంటుంది. ఆ డేటా ఆధారంగా మరణాల వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు వారి కుటుంసభ్యుల నుంచి వివరాలను కూడా సేకరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా మరణించిన వ్యక్తి ఇరుగు పొరుగున ఉండే సుమారు అదే వయస్సు, జెండర్ కలిగిన వ్యక్తులను కూడా తమ సిబ్బంది ఆ మరణాల గురించి ఆరా తీస్తున్నారని డాక్టర్ రాజీవ్ తెలిపారు.
మరణించిన వ్యక్తుల ఆహారపు అలవాట్లు, పొగాకు అలవాటు, జీవన శైలి, కొవిడ్ చరిత్ర, తీసుకున్న టీకాలు, కుటుంబ వైద్య చరిత్ర గురించి వారి కుటుంబసభ్యులను, ఇరుగుపొరుగును అడిగి తెలుసుకుంటున్నామని ఐసీఎమ్మార్ చీఫ్ అన్నారు. కొవిడ్ బారిన పడిన తర్వాత ఆ ఆకస్మిక మరణాలు ఎందుకు సంభవించాయో తెలుసుకోవడానికి ఇంతకుమించి మరో మార్గం లేదని చెప్పారు. కొవిడ్కు ముందు, కొవిడ్ సమయంలో, కొవిడ్ అనంతరం ప్రజల జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.