న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకట్టే కేసులు కానీ, గుండెపోటు కేసులు కానీ పెరగలేదని ఐసీఎంఆర్(ICMR) తన స్టడీ రిపోర్టును రిలీజ్ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ దేశవ్యాప్తంగా ఓ అధ్యయనం చేపట్టింది. సుమారు 25 ఆస్పత్రుల్లో ఆ స్టడీ నిర్వహించారు. అయితే కోవిడ్19 టీకాకు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సంఘటనలతో ఎటువంటి సంబంధంలేదని ఐసీఎంఆర్ తన అధ్యయనంలో తేల్చింది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కోవిడ్ టీకాలతో గుండెపోటు కానీ రక్తం గడ్డకట్టే కేసులు నమోదు కాలేదని ఐసీఎంఆర్ తన రిపోర్టులో చెప్పింది. 2021-23 మధ్య కాలంలో భారత్లో చోటుచేసుకున్న త్రాంబాటిక్ సంఘటనలు, ఆస్పత్రుల్లో కేస్ స్టడీ అన్న టైటిల్తో సర్వే చేపట్టారు.
త్రాంబాసిస్ అంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియ. ఈ పరిస్థితి చాలా వరకు కేసుల్లో మెడికల్ లేదా లైఫ్ స్టైయిల్ రిస్క్ ఫ్యాక్టర్ల వల్ల వస్తున్నట్లు గుర్తించారు. కోవిడ్ కన్నా ముందు నుంచి సిగరేట్ అలవాటు ఉండడం కానీ, గతంలో ఏవైనా వ్యాధులు ఉండడం వల్ల కానీ, కుటుంబీకుల్లో రక్త సమస్యలు ఉన్నవారిలో టీకా రిస్క్ ఉన్నట్లు గుర్తించారని స్టడీలో తెలిపారు. మే 2023 నాటికి సుమారు 97 శాతం అర్హులైన వారికి ఇండియాలో ఓ డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక అప్పటికే 90 శాతం మందికి రెండు దశల డోసు తీసుకున్నారు.
ముందస్తు జాగ్రత్తగా హెల్త్కేర్ సిబ్బందికి మూడవ డోసు ఇచ్చారు. 60 ఏళ్ల దాటిన వారికి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మూడో డోసు ఇచ్చారు. వ్యాక్సినేషన్ వల్ల బెనిఫిట్స్ జరిగినట్లు స్టడీలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి భారత్తో పాటు విదేశాల్లోనూ విస్తృత ఆధారాలు ఉన్నట్లు స్టడీలో తెలిపారు. కోవిడ్19 టీకాల వల్ల వ్యాధుల తీవ్రత తగ్గిందని, ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా తగ్గిందని, దీర్ఘకాలిక సమస్యలు కూడా తగ్గినట్లు స్టడీలో చెప్పారు.
పరిశోధకులు తమ స్టడీలో భాగంగా 432 మయోకార్డియల్(హార్ట్ అటాక్) కేసులను, 767 త్రాంబాటిక్(క్లాటింగ్) కేసులను పరిశీలించారు. ఒకటి లేదా రెండు డోసులు కోవిడ్ టీకా తీసుకున్నవారికి, హార్ట్ అటాక్ కేసులకు లింకు లేదని స్టడీలో తేల్చారు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే కేసుల్లోనూ కోవిడ్ టీకాతో ఎటువంటి లింకులు లేవని తేల్చారు. అయితే కుటుంబీకుల్లో హృద్రోగ సమస్యలు ఉండడం కానీ, ఏవైనా వ్యాధులు ఉండడం కానీ, స్మోకింగ్ లాంటి సమస్యలు ఉన్నవారిలో క్లాటింగ్తో సంబంధం ఉన్నట్లు స్టడీలో తేలిందన్నారు. ఐసీఎంఆర్-ఎన్ఐఈ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ మురేకర్ ఆధ్వర్యంలో అధ్యయనం జరిగింది. కోవిడ్19 టీకాల వల్ల యువతలో హార్ట్ అటాక్ సమస్యలు కానీ, రక్తం గడ్డకట్టడం లాంటి ఘటనలు పెరగలేదని స్టడీ ద్వారా నిర్ధారించారు.