న్యూఢిల్లీ : భారత్లో మంకీపాక్స్ వైరస్ కేసు ఇంతవరకూ వెలుగుచూడలేదని, ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం స్పష్టం చేసింది. అమెరికా, యూరప్లో మంకీపాక్స్ వైరస్ కేసులు బయటపడుతున్నాయని, భారత్లో ఇప్పటివరకూ వైరస్ కేసులు వెలుగుచూడలేదని ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ ముఖర్జీ స్పష్టం చేశారు.
మంకీపాక్స్ సోకితే తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు ఉంటాయని, ఒంటిపై దద్దుర్లు రెండు మూడు రోజుల తర్వాత కనిపిస్తాయని పేర్కొన్నారు. రోగితో దగ్గరగా ఉన్నవారికే ఈ వ్యాధి ప్రబలుతుందని చెప్పారు. మంకీపాక్స్ కేసులు వెలుగుచూస్తున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారు పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మంకీపాక్స్పై మనం భయపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
ఇక మంకీపాక్స్ వైరస్ 20 దేశాలకు వ్యాపించిందని, 200 కేసులు ఇప్పటివరకూ నిర్ధారణ అయ్యాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ముందుగా మే 7న బ్రిటన్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదవగా ఇటీవల ఉత్తర అమెరికా, యూరప్ల్లోనూ వైరస్ విస్తరించింది. ఈ వైరస్ పశ్చిమ ఆఫ్రికా స్ట్రెయిన్కు చెందినదని, ఈ వైరస్ బారినపడిన రోగులు కొన్ని వారాల్లోనే కోలుకుంటారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ వైరస్ బారినపడి ఇంతవరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడికాలేదు.