న్యూఢిల్లీ : తమ పథకాలపై ఐఏఎస్ స్థాయి ఉన్నతాధికారుల చేత ఊరూరా తిరుగుతూ ప్రచారం చేయించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఐఏఎస్ అధికారులను ‘రథ్ ప్రభారిస్(ప్రత్యేక అధికారులు)గా నియమించడం అనైతికం, చట్ట విరుద్ధమని మాజీ సీనియర్ ఉన్నతాధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు.
పథకాలపై ప్రచారం పేరుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికారులను రంగంలోకి దించడం ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని, అందులో మోదీ ఫొటో పెట్టాలని కేంద్రం ఇటీవల సైనిక అధికారులకు ఆదేశాలు ఇవ్వటం తీవ్ర దుమారం రేపింది.
ప్రత్యేక రథాల్లో తిరుగుతూ ప్రచారం..
పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులను ‘రథ్ ప్రభారిస్’లుగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకొన్నది. వచ్చే నెల నుంచి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో దేశంలోని 2.69 లక్షల గ్రామ పంచాయతీలను కవర్ చేస్తూ 765 జిల్లాల్లో ప్రత్యేకంగా రూపొందించిన రథాల్లో తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని ఆదేశాలు జారీచేసింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వడం కోడ్ను ఉల్లంఘించినట్టేనని ఈఏఎస్ శర్మ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనకూడదని సివిల్ సర్వీసెస్ నిబంధనలు చెబుతున్నాయని అన్నారు. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు కేంద్ర మంత్రులు పోటీచేస్తున్నారని, ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. తమ అధికారులతో వారి నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.