న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : అర్హత కలిగిన తమ ముగ్గురు ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్లను(క్యూఫ్ఐ) వేల్స్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) వ్యాలీకి పంపుతున్నట్టు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ప్రకటించింది. బ్రిటన్లో రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకువారు తొలిసారిగా శిక్షణ ఇవ్వనున్నారు.. భారత్-బ్రిటన్ రక్షణ సహకారంలో ఈ మోహరింపు ఒక చరిత్రాత్మక తొలి ఘట్టంగా ఐఏఎఫ్ అభివర్ణించింది.
ఇది ఇరు దేశాల మధ్య వృత్తిపరమైన నైపుణ్యం, పరస్పర సమన్వయం, సుదీర్ఘకాలంగా ఉన్న రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఎక్స్ వేదికగా ఐఏఎఫ్ పేర్కొంది. ఏప్రిల్ నెల ప్రారంభంలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జోనాథన్ నికోలస్ పావెల్తో ప్రాంతీయ భద్రతా పరిణామాలపై చర్చలు జరిపారు. ప్రస్తుత భారత్-బ్రిటన్ రక్షణ సహకార చట్టాల పురోగతిని కూడా వారు సమీక్షించారు.