న్యూఢిల్లీ: యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల రక్షణకు ‘చాఫ్’ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని భారత వాయుసేన (ఐఏఎఫ్), భారత నౌకాదళం నిర్ణయించాయి. క్లిష్టమైన రక్షణ సాంకేతికత కొనుగోలుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)తో ఒప్పందం చేసుకోనున్నాయి. యాంటీ షిప్, రాడార్ గైడెడ్ క్షిపణుల దాడుల నుంచి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలకు ‘చాఫ్’ సాంకేతిక తోడ్పడుతుంది. యుద్ధ సమయంలో శత్రు రాడార్ గైడెడ్ క్షిపణి నుండి యుద్ధ విమానాలు లేదా నౌకలను రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత ‘చాఫ్’. శత్రు క్షిపణులను తిప్పికొట్టడానికి చాలా తక్కువ పరిమాణంలో గాలిలో విడుదల చేసే చాఫ్ పదార్థం డికోయ్గా పనిచేస్తుంది.
ఈ చాఫ్ క్లౌడ్ శత్రు క్షిపణులను తప్పుదారి పట్టిస్తాయి. దీంతో యుద్ధ విమానం లేక యుద్ధ నౌక భద్రతను ఈ సాంకేతికత నిర్ధారిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్తో భాగంగా దేశీయంగా ‘చాఫ్’ సాంకేతికతను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. అమెరికా తర్వాత ఇలాంటి క్లిష్టమైన రక్షణ సాంకేతికత అభివృద్ధి చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది.
భారత యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలకు శత్రు దేశ క్షిపణుల దాడుల నుంచి రక్షణ కోసం అత్యాధునిక ‘చాఫ్’ సాంకేతికను డీఆర్డీఏ అభివృద్ధి చేసింది. షార్ట్ రేంజ్ చాఫ్ రాకెట్ (SRCR), మీడియం రేంజ్ చాఫ్ రాకెట్ (MRCR), లాంగ్ రేంజ్ చాఫ్ రాకెట్ (LRCR) అనే మూడు రకాల చాఫ్ రాకెట్లను తయారు చేసింది. యూజర్ ట్రయల్స్ విజయవంతం తర్వాత ఇండియన్ నేవీలో వీటిని ప్రవేశపెడతారు.
అలాగే భారతీయ వైమానిక దళం కోసం అధునాతన చాఫ్ కాట్రిడ్జ్-118/Iని కూడా డీఆర్డీవో అభివృద్ధి చేసింది. అత్యధిక ఫ్రిక్వెన్సీ రాడార్ క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు యుద్ధ విమానాలకు ఇది సహరిస్తుంది. పనితీరు, ట్రయల్స్పై సంతృప్తి వ్యక్తం చేసిన భారత వాయుసేన, వైమానిక దళంలోకి వీటి ప్రవేశ ప్రక్రియను ప్రారంభించింది.
రష్యా క్షిపణి క్రూయిజ్ యుద్ధ నౌక మాస్కోవాను యాంటీ షిప్ క్షిపణితో ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. దీంతో నాలుగు దశాబ్ధాలుగా రష్యాకు కీలక సేవలందించిన ఈ యుద్ధ నౌక నల్ల సముద్రంలో మునిగిపోయింది. అలాగే ఉక్రెయిన్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ దాడుల్లో పలు రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనీస్ డీఎఫ్-21 వంటి యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణుల నుంచి భారత యుద్ధ నౌకలను రక్షించుకునేందుకు ‘చాఫ్’ సాంకేతికను సమకూర్చుకోవాలని ఇండియన్ నేవీ యోచిస్తున్నది.