న్యూఢిల్లీ : ఎల్ఏసీ శాంతిని నెలకొల్పేందుకు భారత్ సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో 16వ రౌండ్ సైనిక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరి ఆదివారం కీలక ప్రకటన చేశారు. చైనాను ఎదుర్కొనేందుకు సైన్యం పూర్తిస్థాయిలో సన్నాహలు చేస్తోందన్నారు. పీఎల్ఏఏఎఫ్కి చెందిన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ సరిహద్దు దగ్గరగా వచ్చిన సమయంలో భారత వాయుసేన వెంటనే ఫైటర్లతో స్పందిస్తూ పరిస్థితిని ఎర్కొంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు.
అలాగే చైనాకు సరిహద్దుల్లో ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా ప్రతి కదలికలను నిశితంగా గమనిస్తున్నామన్నారు. 2020 జూన్లో జరిగిన గాల్వాన్ ఘటన తర్వాత తూర్పు లడఖ్ సెక్టార్లో ఎల్ఏసీ వెంట రాడార్ల మోహరింపును ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ రాడార్లన్నింటినీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్తో ఏకీకృతం చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఎల్ఏసీ అంతటా కదలికలను పర్యవేక్షించే వీలు కలుగుతుందన్నారు.
ఉత్తర సరిహద్దుల్లో ఉపరితలం నుంచి గగనతం, గగనతలం నుంచి నేలపై దాడులు చేసే సామర్థ్యాన్ని సైతం ఎయిర్ఫోర్స్ పెంచిందన్నారు. మొబైల్ నిఘా పోస్టుల సంఖ్యను కూడా పెంచామని వీఆర్ చౌదరి పేర్కొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లతో పాటు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA), లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (Mk-1A), (Mk-2లను) ఎయిర్ఫోర్స్లో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇండక్షన్పై ప్రశ్నించగా.. షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపారు. మిస్సైల్ సిస్టమ్ను చైనా, పాక్ సరిహద్దుల్లో సమయానికి మోహరిస్తున్నట్లు వివరించారు.