న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. తనకు ఈ పదవి ఇచ్చినవాళ్లు తప్పుకొమ్మని సంకేతాలిస్తే ఏ క్షణమైనా తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం అడుగు ముందుకు వేసినందుకు, వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం ద్వారా పెద్ద మనసు చూపినందుకు ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
పంటలకు కనీస మద్దతు ధరపైనా, ఇతర సమస్యలపై కమిటీల ఏర్పాటుకు కేంద్రం నుంచి హామీ తీసుకుని రైతులు ఆందోళన విరమించాలని సత్యపాల్ మాలిక్ కోరారు. ఆందోళనలను మరింత సాగదీయవద్దని ఆయన రైతులకు సలహా ఇచ్చారు. కనీస మద్దతు ధర అనేది రైతుల ప్రధాన డిమాండ్ అని, ఈ విషయంలో తాను వారికి అండగా ఉంటానని ఆయన చెప్పారు. రైతుల అన్ని డిమాండ్లను ఆమోదించడం సాధ్యం కాదని, కాబట్టి మద్దతు ధరపై హామీ తీసుకుని ఆందోళన విరమించాలని కోరారు.