న్యూఢిల్లీ: కార్గిల్ విజయగాథను దేశంలోని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. కార్గిల్ యుద్ధం మన దేశ సైనికుల పరాక్రమానికి, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధం సందర్భంగా దేశ సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని ప్రధాని గుర్తుచేశారు. రేపు కార్గిల్ డేను పురస్కరించుకుని రేపు ప్రతి ఒక్కరూ దేశ కోసం ప్రాణత్యాగం చేసిన, ప్రాణ త్యాగానికి సిద్ధపడి పోరాడుతున్న సైనికులకు సెల్యూట్ చేయాలని ఆయన సూచించారు.
ఒలింపిక్స్కు భారత్ తరపున ఆడుతున్న ప్లేయర్స్ను అందరూ సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చెయ్యాలని ప్రధాని కోరారు. ఇందుకోసం విక్టరీ పంచ్ క్యాంపెయిన్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మన్ కీ బాత్లో చెప్పే అంశాల్లో 75 శాతం 35 ఏళ్ల లోపు యువత నుంచే వస్తున్నాయనీ, ఇది ఎంతో మంచి పరిణామమని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలు జీవనాధారం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తుచేశారు.
శివార్లలో ఉండే గ్రామాల్లో సైతం సరికొత్త ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. మణిపూర్లో యాపిల్ పంటల సాగు, ఉత్తరప్రదేశ్లో అరటిపండ్లతో ఫైబర్ ఉత్పత్తిని మోదీ ప్రస్తావించారు. ఆగస్ట్ 15కి ముందు వచ్చిన ఈ మన్కీ బాత్లో యువతకు ప్రధాని సరికొత్త పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ‘Nation First and Always First’ (దేశం ముందు… ఎల్లప్పుడూ ముందే) అనే ఉద్దేశంతో ముందుకు సాగాలన్నారు.