లాలూ ప్రసాద్ యాదవ్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం యాక్టివ్ అవ్వడమే కాకుండా… ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధపడిపోతున్నారు. మంగళవారం ఆర్జేడీ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగానే లాలూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో పోటీ చేయడానికి కోర్టు నుంచి ఇంకా అనుమతి రాలేదు. అనుమతి రావడమే తరువాయి… ఎన్నికల్లో పోటీ చేసి.. లోక్సభలో అడుగుపెడతా. మోదీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోక్సభలో అడుగుపెట్టి, వాటన్నింటికీ సరైన కౌంటర్ ఇస్తా’ అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు.
యూపీలో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని లాలూ జోస్యం చెప్పారు. బీజేపీ చేస్తున్న ప్రచారానికి ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. ఎంత సేపూ మందిరం, మతం, అల్లర్లు వీటి గురించే మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సీఎ యోగి తరుచూ అన్ పార్లమెంటరీ పదాలు వాడుతున్నారని, ఆయనలో అసహనం పెరిగిపోయిందని మండిపడ్డారు. ఇక సీఎం నితీశ్పై కూడా లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు చేశారు. సీఎం కుర్చీని కాపాడుకోవడానికి నితీశ్ ఎంతదాకైనా వెళ్తారంటూ విమర్శించారు.