న్యూఢిల్లీ: మహేంద్ర గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్ర పద్మభూషణ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరానికి వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో ఆయనకు ఆ అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. అయితే తాను పద్మ అవార్డు అందుకునేందుకు అర్హుడిని కాదేమో అన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎంతో కీలక సేవలు చేస్తున్న వారిని ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరించిందని, వ్యక్తిగతంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన వారిని ప్రభుత్వం గుర్తిస్తున్న తీరు హర్షణీయమని, అయితే వారితో సమానంగా తనను పద్మతో సన్మానించడం సహేతుకంగా లేదని, బహుశా తాను ఆ అవార్డుకు అనర్హుడినేమో అన్న అభిప్రాయాన్ని ఆనంద్ మహేంద్ర వ్యక్తం చేశారు.
కర్నాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసీ గౌడపై ఆనంద్ మహేంద్ర తన ట్వీట్లో స్పందించారు. తులసీ గౌడ సుమారు 30 వేల మొక్కలు నాటారు. హలక్కీ తెగకు చెందిన 77ఏళ్ల ఆ మహిళకు వృక్షాలు, మొక్కలపై అపార జ్ఞానం ఉంది. మంగుళూరుకు చెందిన ఓ పండ్ల వ్యాపారికి కూడా పద్మశ్రీ దక్కడం అనిర్వచనీయమని ఆనంద్ మహేంద్ర అభిప్రాయపడ్డారు. ఆనంద్ మహేంద్ర ట్వీట్పై పలువురు నెటిజెన్లు రియాక్ట్ అయ్యారు. కొందరు ఆయన కామెంట్ను స్వాగతించారు. మహేంద్ర హుందాతాన్ని కొందరు అభిమానించారు.