న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు (కేకే) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇవాళ కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాష్ట్రపతి ప్రసంగాన్ని తాము విన్నామని, అందులో దేశంలోని ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావనే లేదని విమర్శించారు.
దేశంలో క్రోనీ క్యాపిటలిజమ్ నడుస్తోందని, ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేవిధంగా పాలన నడుస్తోందని కేకే మండిపడ్డారు. ప్రభుత్వం మెచ్చిన బిజినెస్ మాగ్నెట్ గౌతమ్ అదానీ పేరుతో అదానీ చట్టం తీసుకొస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. దేశంలో అదానీ యాక్ట్ తీసుకురమ్మని ప్రధానికి సూచన చేస్తే బాగుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేకే సలహా ఇచ్చారు.
అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని కేశవరావు చెప్పారు. కేవలం నరేంద్రమోదీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపడానికే తాము ఇవాళ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాగా, ఇవాళ బీఆర్ఎస్తోపాటు అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది.