Shivsena Crisis | శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గంలో కొందరు ఎమ్మెల్యేలపై ఒత్తిడి కొనసాగుతున్నదని ఆ పార్టీ ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ చెప్పారు. ఒత్తిడి వల్ల కొందరు లేఖలపై సంతకాలు చేస్తున్నారని శుక్రవారం తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటుతో మహా వికాస్ అఘాడీ కూటమి భవితవ్యం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. గణనీయ స్థాయిలో ఎమ్మెల్యేలను ఏక్నాథ్ షిండే తన వైపుకు తిప్పుకున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో కైలాస్ పాటిల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
కొందరు వ్యక్తులు ఒత్తిడి మధ్య లేఖలపై సంతకాలు చేశారు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతోనే మేమంతా ఉంటాం అని కైలాస్ పాటిల్ మీడియాతో అన్నారు. ఉస్మానాబాద్ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కైలాస్ పాటిల్.. ఈ నెల 20న ఏక్నాథ్ షిండే ఇచ్చిన విందు కోసం ఠాణెకు వెళ్లారు.
కానీ, ఈ నెల 20 రాత్రి 8-9 గంటల మధ్య తాము బయలుదేరిన కారు మహారాష్ట్ర సరిహద్దులను వీడటంతో అనుమానం పెరిగిందన్నారు. గుజరాత్లోని సూరత్కు వెళుతున్న తమ కారు నుంచి తొలుత తప్పించుకున్నట్లు చెప్పారు కైలాస్ పాటిల్. తర్వాత తాను పరుగులు తీయాల్సి వచ్చిందన్నారు. బైక్పైనా, ట్రక్పైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి చేరుకున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి సీఎం అధికార నివాసం వర్షకు చేరుకున్నట్లు వివరించారు.