న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం మహిళా ఎంపీలపై దాడి చేసిన విధానాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన 55 సంవత్సరాల పార్లమెంటరీ కెరీర్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరుగలేదని చెప్పారు. బయట నుండి 40 మందికిపైగా పురుషులు, మహిళలను సభలోకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ ఘటన బాధాకరమైనదని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు సభలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరుపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో నేత పియూష్ గోయల్ డిమాండ్ చేశారు. మహిళా సెక్యూరిటీ గొంతును నొక్కేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అంతేగాక తమ చాంబర్ల నుంచి బయటకు వస్తున్న తనను, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని ప్రతిపక్ష సభ్యలు అడ్డుకునేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకరమని, అలాంటి సంఘటనలను సభలో లేదా దేశంలో సహించకూడదన్నారు.