Satabdi Roy : తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పై అసమ్మతి గళం వినిపిస్తున్న రెబల్ ఎంపీల్లో ఒకరైన ప్రముఖ నటి శతాబ్ది రాయ్ (Satabdi Roy) తాజాగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రాజకీయపరంగా ఎన్డీయే (NDA) కు మద్దతు తెలుపడం సరైన నిర్ణయమే అయినప్పటికీ.. నైతికంగా మాత్రం తాను తప్పు చేస్తున్నానన్న భావన కలుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మమతా బెనర్జీకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు ‘దీదీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా’ అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం టీఎంసీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర అసెంబ్లీలో సుమారు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేయగా, ఇప్పుడు లోక్సభలోనూ అదే తరహా పరిస్థితి నెలకొన్నది. కాకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని, తాము ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని పేర్కొంటూ జూన్ 9న లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేందుకే వారు ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తున్నది.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి చేతిలో టీఎంసీ ఓటమి పాలైన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మమతా బెనర్జీ కుటుంబ సభ్యులు పార్టీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, పార్టీ పత్రాలపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారని రెబల్స్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఐడీ అధికారులు మమత బెనర్జీ నివాసం సమీపంలోని టీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు, అభిషేక్ బెనర్జీ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. కాగా ఈ తిరుగుబాటును మమత బెనర్జీ వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. రెబెల్స్ నాయకులంతా అవకాశవాదులని, వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని విమర్శిస్తోంది.