న్యూఢిల్లీ: డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి (1డాలరు= రూ.82.68) చేరుకోవడంపై వస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భిన్నంగా స్పందించారు. అమెరికాలో పర్యటనలో ఉన్న ఆమె మాట్లాడుతూ దీన్ని రూపాయి విలువ పడిపోతున్నట్టుగా తాను చూడటం లేదని, డాలర్ బలపడుతుండటంతో అలా అనిపిస్తున్నదని వింత భాష్యం చెప్పారు. మన రూపాయి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ కంటే మెరుగ్గానే ఉన్నదన్నారు. మరోవైపు బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతున్నదని తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈడీలాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని ఆమె చెప్పుకురావడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.