పనాజీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది మొదలు ఆయా రాష్ట్రాల్లో నేతల జంపింగ్జపాంగ్ మొదలైంది. ఒకపార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు ముమ్మరమయ్యాయి. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అయితే జంపింగ్లు మరింత జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో గోవాలో కూడా బీజేపీ ప్రభుత్వం నుంచి ఓ మంత్రి వైదొలిగాడు. కానీ ఆయన వేరే పార్టీలో చేరడం లేదు. బీజేపీలో చేరుతున్నాడు. మరి అంతమాత్రానికి రాజీనామా ఎందుకనేగా మీ సందేహం..? ఎందుకంటే..
గోవాలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవింద్ గౌడే అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. అనంతరం బీజేపీ మంత్రి పదవి ఆఫర్ చేయడంతో ప్రభుత్వంలో చేరారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడబోతున్నారు.