న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని ఢీ కొట్టేందుకు ఆదానీ గ్రూప్స్ అధినేత గౌతం ఆదానీ సిద్ధం అవుతున్నారు. అంతర్జాతీయంగా సంపన్న వ్యాపారవేత్తల్లో మరోమారు గౌతం ఆదానీ ర్యాంక్ మారింది. ఇక వ్యక్తిగత సంపదలో ముకేశ్ అంబానీ, గౌతం ఆదానీ మధ్య అంతరాయం చాలా తక్కువైంది.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత నికర సంపద 84 బిలియన్ల డాలర్లు (రూ.6.13 లక్షల కోట్లు). ప్రపంచంలోనే 12వ సంపన్న బిజినెస్మెన్. ఆసియాలో నంబర్వన్గా నిలిచారు. గౌతం ఆదానీ నికర సంపద 78 బిలియన్ల డాలర్లు లేదా రూ.5.69 లక్షల కోట్లు.
15 రోజుల క్రితం ముకేశ్ అంబానీ, గౌతం ఆదానీ మధ్య వ్యక్తిగత సంపదలో తేడా రూ.75 వేల కోట్లు. ఈ రెండు వారాల్లో ఆదానీ వ్యక్తిగత సంపద శరవేగంగా పెరిగింది.
గౌతం ఆదానీ సారధ్యంలోని ఆదానీ గ్రూప్లోని ఆరు లిస్టెడ్ కంపెనీలు గత 15 రోజుల్లో శరవేగంగా పైపైకి దూసుకెళ్లాయి. ఆదానీ ట్రాన్స్మిషన్ షేర్ 20 శాతానికి పైగా, ఆదానీ టోటల్ గ్యాస్ 35 శాతం పెరిగాయి. ఇక గత మూడు రోజుల్లో ఆదానీ పవర్ 45 శాతానికి పైగా పెరిగింది.
ఆదానీ ఎంటర్ప్రైజెస్, ఆదానీ పోర్ట్ స్క్రిప్ట్ల్లో అద్భుతమైన పురోగతి నమోదైంది. అందువల్లే గౌతం ఆదానీ వ్యక్తిగత సంపద పెరగింది. మరోవైపు గతవారం రిలయన్స్ షేర్ కూడా 10 శాతం పెరిగింది. ప్రస్తుతం రిలయన్స్ స్క్రిప్ట్ రూ.2,194 వద్ద ట్రేడవుతున్నది.
ఆదానీ గ్రూప్ స్క్రిప్ట్ల పెరుగుదల ఇలాగే కొనసాగితే వ్యక్తిగత సంపద పెంచుకోవడంలో త్వరలోనే ముకేశ్ అంబానీని గౌతం ఆదానీ దాటేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ నెలలో రిలయన్స్ వార్షిక జనరల్ బాడీ సమావేశం జరుగనున్నది.
రిలయన్స్ ఏజీఎంలో ముకేశ్ అంబానీ కొన్ని స్పెషల్ ప్రకటనలు చేస్తే సంస్థ షేర్లు జూమ్మంటూ పైపైకి దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేసన్ రూ.13.78 లక్షల కోట్లు ఉంటే, ఆదానీ గ్రూప్ ఎం-క్యాప్ రూ.8 లక్షల పై చిలుకు.
ఈ ఏడాదిలో గౌతం ఆదానీ నికర సంపద 45 బిలియన్ల డాలర్లు పెరిగింది. కానీ ముకేశ్ అంబానీ నికర సంపద కేవలం 8 బిలియన్ల డాలర్లు మాత్రమే ఎక్కువైంది. ఇదిలా ఉంటే, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా.. కుబేరుల జాబితాలో 27వ స్థానంలో ఉన్నారు.
భారత్కు చెందిన హెచ్సీఎల్ చైర్మన్ శివ్ నాడార్ 70వ ర్యాంక్ పొందారు. విప్రోకు చెందిన అజీం ప్రేమ్ జీ ప్రపంచ కుబేరుల జాబితాలో 43వ ర్యాంక్లో ఉన్నారు. టాప్-100 కుబేరుల్లో భారత్ కంటే చైనీయులే ఎక్కువ.
అమెజాన్ అధినేత 190 బిలియన్ల డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మూడో ర్యాంక్లో ఉన్నారు.
కరోనా మహమ్మారి వల్ల కోట్ల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కానీ కార్పొరేట్లు ముకేశ్ అంబానీ, గౌతం ఆదానీల వ్యక్తిగత సంపద గణనీయంగా పెరిగింది. అయితే, ఈ ఏడాది ముకేశ్ అంబానీ కంటే వేగంగా ఆదానీ సంపద పెరిగింది.