‘జీవితం అంటేనే రిస్క్. మనసుకు నచ్చిన పనులను చేస్తూ ముందుకుపోవాల్సిందే. ఈ ప్రయాణంలో జయాపజయాలను ఎవరూ అంచనా వేయలేరు. ‘శబరి’ ఓ విభిన్నమైన కథ. తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అని చెప్పింది వరలక్ష్మీ శరత్కుమార్. ఆమె ప్రధాన పాత్రలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ‘శబరి’ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం వరలక్ష్మీ శరత్కుమార్ మాట్లాడుతూ ‘ఈ కథ వినగానే బాగా నచ్చింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఓ సాధారణ యువతి తన భర్తతో వచ్చిన విభేదాల వల్ల అతని నుంచి విడిపోతుంది. తన కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది. కూతురికి మంచి జీవితాన్ని అందించాలని ప్రయత్నించే క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు? వాటిని ఎలా అధిగమించిందన్నదే ఈ సినిమా కథ’ అని చెప్పింది.
తల్లి పాత్రను పోషించడం గురించి మాట్లాడుతూ ‘తమిళంలో పొడా పొడి, పందెం కోడి-2 చిత్రాల్లో తల్లి పాత్రలు చేశాను. నేను నటనను ప్రేమిస్తాను. ఇమేజ్ పట్టింపులు లేకుండా ప్రేక్షకులను మెప్పించే పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం’ అని పేర్కొంది. ఈ సినిమాలో తాను యాక్షన్ సీక్వెన్స్లో కనిపిస్తానని, అవి సినిమాకు హైలైట్గా నిలుస్తాయని, మదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని ఆమె తెలిపింది. పెళ్లి గురించి మట్లాడుతూ ‘ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం మీ అందరికి తెలుసు. ఈ ఏడాది పెళ్లి వేడుక ఉంటుంది’ అని వరలక్ష్మీ శరత్కుమార్ వెల్లడించింది.