ముంబై: ఒకప్పుడు కిలో పది, ఇరవై రూపాయలకు దొరికిన టమాట ఇప్పుడు సామాన్యుడి అందకుండా పోయింది. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నది. దాంతో సామన్యులెవరూ టమాట జోలికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో టమాట ధరలపై బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
తాను సూపర్ స్టార్ను కాబట్టి టమాట ధరల ప్రభావం తనపై పెద్దగా ఉండదని ప్రజలు అనుకుంటుండవచ్చని, కానీ తనపై కూడా పెరిగిన టమాట ధర ప్రభావం ఉన్నదని సునీల్ శెట్టి చెప్పాడు. ధరల భారంతో ప్రస్తుతం తాను టమాటలను తక్కువగా తింటున్నానని పేర్కొన్నాడు. ఒక రెస్టారేటర్ (రెస్టారెంట్ యజమాని) గా తానూ తక్కువ ధరలో టమాటలు కొనుగోలు చేయడం కోసం బేరమాడాల్సి వస్తుందని తెలిపాడు.
కానీ, దేశంలో టమాటల ధరలు పెరిగిపోవడంవల్ల వాటిని కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు వెళ్లే ప్రజలు వాటి రుచి, నాణ్యత విషయంలో రాజీపడాల్సి వస్తున్నదని సునీల్ శెట్టి విచారం వ్యక్తంచేశాడు. మరి, సునీల్ శెట్టిని టమాట ధరలు నిజంగానే ప్రభావితం చేస్తున్నయంటారా..?