Tejashwi Yadav: బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి మహాకూటమి సర్కారును రద్దు చేయమని గవర్నర్ను కోరిన నితీశ్.. సర్కారు రద్దు అనంతరం బీజేపీతో జతకట్టారు. ఎన్డీఏ సర్కారును కొలువుదీర్చి 9వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ పరిణామాలపై ఆర్జేడీ అగ్ర నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ స్పందించారు. నితీశ్ కుమార్ అలసిపోయిన ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ఆట ఇప్పుడే మొదలైందని, ఇంకా చాలా ఆట మిగిలి ఉందని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ తుడిచిపెట్టుకుపోతుందని జోష్యం చెప్పారు. కావాలంటే లిఖితపూర్వకంగా రాసిస్తానని అన్నారు. బీహార్ ప్రజలు తమతోనే ఉన్నారని, నితీశ్ రాజకీయాలపై వారు విరక్తి చెందారని వ్యాఖ్యానించారు.
కాగా, బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆదివారం ఉదయం సీఎం పదవికి రాజీనామా చేశారు. మహాకూటమి సర్కారును రద్దు చేయాలని గవర్నర్ను కోరారు. రాజీనామా ఆమోదం అనంతరం గవర్నర్ను మరోసారి కలిసి.. తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ ఆహ్వానంతో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చారు. సీఎంగా మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు.