బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు యడ్యూరప్ప వెల్లడించారు. సోమవారం లంచ్ తర్వాత గవర్నర్ను కలవనున్నట్లు ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేస్తున్నానని చెప్పే సమయంలో ఆయన కాస్త భావోద్వేగానికి గురయ్యారు. యడ్యూరప్పను పదవి నుంచి తప్పిస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
నా కెరీర్ మొత్తం ఒకదాని తర్వాత మరో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నాను. అయినా అలాగే పని చేస్తూ వచ్చాను. ప్రభుత్వ అధికారులు, చీఫ్ సెక్రటరీకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. నన్ను విశ్వసించి వాళ్లంతా కఠోరంగా శ్రమించారు. కర్ణాటక ప్రజలకు రుణపడి ఉంటాను. ప్రజలు మనపై విశ్వాసం కోల్పోయారని అధికారులు, ఎమ్మెల్యేలకు చెప్పదలచుకున్నా. మనం మరింత నిజాయితీగా పనిచేయాలి అని ఈ సందర్భంగా యెడ్యూరప్ప అన్నారు.