న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత తీయని ఉగ్రవాదిని తానే అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇవాళ ఆయన ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. హాస్పిటళ్లు, స్కూళ్లు, రోడ్లు నిర్మించే స్వీటెస్ట్ టెర్రరిస్టుని అని కేజ్రీ అన్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఢిల్లీ సీఎం కౌంటర్ ఇస్తూ.. వృద్ధులను ఆశ్రమాలకు, ప్రజలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఉగ్రవాదినంటూ ఆయన అన్నారు. పార్టీ మాజీ సహచరుడు కవి కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలకు ధీటుగా కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు.
వాళ్ల ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని, వాటిని నమ్మితే నిజంగానే నేను ఉగ్రవాదిని అవుతానని, అలాంటప్పుడు గడిచిన పదేళ్ల నుంచి భద్రతా ఏజెన్సీలు ఏం చేస్తున్నట్లు అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. వందేళ్ల క్రితం కూడా భగత్ సింగ్ను బ్రిటీషర్లు ఉగ్రవాదిగా పిలిచారని, భగత్ను తాను గుడ్డిగా ఫాలో అవుతానని, ఇప్పుడు మళ్లీ చరిత్ర తిరుగరాస్తున్నారని, అవినీతి నేతలంతా ఒక్కటై భగత్ సింగ్ భక్తుడిని ఉగ్రవాదిగా పిలుస్తున్నట్లు కేజ్రీ అన్నారు. తనపై ఎన్ఐఏలో ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఓ ఆఫీసర్ తెలిపారని, రెండు రోజుల్లో ఆ కేసు ఫైల్ చేయనున్నట్లు తెలిసిందన్నారు. అలాంటి ఎఫ్ఐఆర్లను స్వాగతిస్తున్నట్లు సీఎం కేజ్రీ చెప్పారు.